Gastritis !! – Know how to overcome by yourself.. Positive Results Guaranteed #8

by | Aug 30, 2019 | Ayurvedam Treatment, Home Remedies

Gastritis !! – Know how to overcome by yourself.. Positive Results Guaranteed..

గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుంది ?  ఎలా తగ్గించుకోవాలి ?

మనం తీసుకున్న ఆహారం కడుపులో తిరిగి వండబడుతుంది . వండే అగ్నిని జఠరాగ్ని అంటారు . అందుకు వివిధ రకాల యాసిడ్లు సహకరిస్తున్నాయి . జఠరాగ్ని బలంగా ఉంటే తీసుకున్న ఆహారం సక్రమంగా ”వచనం ” అవుతుంది . ఇలా కడుపులో వచనం చేసే అగ్నినే పాచకాగ్ని జఠరాగ్ని అని పిలుస్తుంటాం . ఈ అగ్ని తగ్గిపోతే, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు . అజీర్తిగా ఉంది అంటుంటాం అప్పుడు , దీన్నే అగ్నిమాంద్యం అంటాం . కడుపులో జఠరాగ్ని తగ్గి అగ్నిమాంద్యం ఏర్పడితే సమస్తమైన వ్యాధులూ ప్రారంభం అవుతున్నట్లు లెక్క . ” అగ్ని ” బలంగా ఉన్నవారికి విషం పెట్టినా ఏమీకాదు . అమాంతం హరాయించుకోగలుగుతున్నారు .

గ్యాస్ … గ్యాస్ … గ్యాస్

అధోమార్గంలోంచి , పెద్ద పెద్ద శబ్దాలు చేసుకొంటూ ఆపానవాయువులు వెళ్ళడం , త్రేన్పులు , విరేచనం సరిగ్గా అవ్వకపోవడం ఒక్కోసారి పదే పదే వెళ్ళాలనిపించడం , ఎన్నిసార్లు వెళ్ళినా ఫ్రీగా అవ్వకపోవడం , కడుపులో గడబిడమంటూ ప్రేగులు అరుస్తుండటం , శరీరం బరువుగా బడలికగా బద్దకంగా ఉండటం , తలతిరుగుడు , తలనొప్పి , నడుములోంచి , వెన్నులోంచి పోటు మొదలై నడుం బిగుసుకుపోవడం దాహం , జ్వరం వచ్చినట్లుండటం , వాంతి అవ్వడం , వికారం పుట్టి వాంతి అయితేగానీ సుఖం లేదనిపించటం … ఇవన్నీ అజీర్తి వలన కలిగే లక్షణాలు , అంటే కడుపులో అగ్ని తగ్గిపోయినందువలన ఏర్పడే బాధలన్నమాట ….. అగ్ని మందగించి , కడుపులో వాతం పెరిగితే విరేచన మార్గం దగ్గర కత్తిరించినట్లు పోటుపుడుతుంది .

అన్నం అరగకుండా సగం పక్వమై సగం పక్వo కాకుండా మిగిలిపోయినప్పుడు సహజంగానే పులిసిపోతుంది కదా ! లోపల జీర్ణక్రియకు ఉపకరించే యాసిడ్లు దానితో కలిసి మరింత పులిసిపోతుంది . పుల్లటి త్రేన్పులు , నోట్లో నీళ్ళూరటం, గొంతులో మంట , గుండెల్లో మంట, కడుపులో మంట , శరీరంలో పొగలు వెళ్తున్నట్లు మంటగా ఉండటం , చెమటలు అధికంగా పట్టడం , తల తిరుగుడు పదే పదే నీళ్ళు త్రాగాలనిపించడం … ఇలాంటి బాధలన్నీ వస్తాయి . తరచూ నోటిపూత , గ్యాస్ ట్రబుల్ , అల్సర్లు వంటి వ్యాధులు రావటానికి ఇదిగో … ఈ జఠరాగ్ని మందగించటమే ముఖ్య కారణం .

ఎసిడిటీ తగ్గితేనే అగ్ని పెరుగుతుంది :

అగ్నిమాంద్యం వలన అన్నం జీర్ణంకాక మిగిలిపోయి, పులిసిపోయి , కడుపులో యాసిడ్లు పెరిగిపోతాయి. యాసిడ్ చర్మం మీద పడితే ఏమవుతుంది … ! కాలుతుంది ! అంతకన్నా సున్నితమైన ప్రేగుల్లో యాసిడ్ పెరిగితే లోపల ఎంత భుగభుగలాడిపోతుందో ఊహించండి …!! అదే కడుపులో మంటకూ , ప్రేగులోపల పుళ్ళు పడడానికి కారణం అవుతుందన్నమాట . ‘యాంటాసిడ్స్ ‘ కడుపులో పెరిగిన ఎసిడిటీని తగ్గిస్తాయి . అంతేగానీ కడుపులో అగ్నిని చల్లార్చేవి కావు . ఎసిడిటీ తగ్గితే జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది .

జఠరాగ్ని ఎందుకు మందగిస్తుందంటే … ?

1. అన్నం అధికంగా తినడం వలన , అతిగా తిండిబోతుల్లా ప్రవర్తించడం వలన మాత్రమే అగ్నిమాంద్యం అనే ”గ్యాస్ ట్రబుల్ ” వ్యాధి వస్తుందనుకోనవసరం లేదు . ఉపవాసాలు పదే పదే చెయ్యడం కూడా అగ్ని మాంద్యానికి దారితీస్తుంది .

2. సగం ఉడికీ , సగం ఉడకని ఆహార పదార్దాలను తీసుకోవడం . ఒక టైం లేకుండా అకాలంలో భోజనం చెయ్యడం వంటివి కూడా అగ్ని చల్లారి పోవడానికి కారణాలే . ప్రొద్దుననగా పొయ్యి వెలిగించి మధ్యాహ్నమో సాయంత్రమో వంట చేస్తానంటే చల్లారిపోయిన ఆ నిప్పు మీద అన్నం ఎంత ఉడుకుతుందో వేళాపాళా లేకుండా భోజనాలు చేసేవారికి ఆకలి చచ్చిపోయాక అన్నం తింటే అంతే జీర్ణం అవుతుంది .

3. విందుభోజనాలలో ,మీటింగులలో , కాన్ఫరెన్స్ లలో ఆలస్యంగా భోజనాలు చెయ్యవలసి వస్తుంది . ఆలస్యం అయ్యింది కదా అని మిగిలున్న ఆకలికి సరిపడా తేలికగా భోజనం చెయ్యడం సాధ్యం కాదు . రకరకాల స్వీట్లు , హాట్లు , బిరియానీలు ఏ మాత్రం అరుగుదలకానివి ఎన్నెన్నో తినవలసి వస్తుంది . జీర్ణశక్తికి మించి ఆహారం తీసుకున్నప్పుడు దాని ఫలితం అనుభవించక తప్పదు .

4. మనకు సరిపడని ఆహార పదార్దాలను తినడం వలన అనేక జబ్బులొస్తాయి . తుమ్ములు , జలుబు , దగ్గు , ఆయాసం , ఉబ్బసం , దద్దుర్లు , దురదలు , వాంతులు , విరేచనాలు … ఇవన్నీ పడని వస్తువుల వలన వచ్చే లక్షణాలే . వీటితో పాటే పడని వస్తువులను తిన్నప్పుడు అగ్నిమాంద్యం కూడా ఒక వ్యాధిగా ఏర్పడుతుంది .

5. డైటింగ్ చెయ్యడం ఈనాటి ఆరోగ్య సూత్రాలలో ఒకటి . స్లిమ్ గా ఉండటం కోసం , బరువు తగ్గడం కోసం ‘డైటింగ్ ‘పేరుతొ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేస్తుంటారు . ఈ మార్పుల్లో ఒక శాస్త్రీయత , ఒక పద్దతి ఉండకపోతే డైటింగ్ వికటించి అగ్నిమాంద్యం ఏర్పడుతుంది . ముఖ్యంగా రూక్షపదార్దాలు అంటే , ఏ మాత్రం స్నిగ్దత్వం లేకుండా రఫ్ గా ఉండేవి తినడం వలన అగ్ని నశించి పోతుంది . ”అగ్నికి ఆజ్యం ” అన్నారు . ఆజ్యం వేస్తే అగ్ని ప్రజ్వరిల్లుతుంది . అందుకని , ఆహారంలో పరిమితంగా నెయ్యి వేసుకొని తినాలి . నెయ్యి లేకుండా తింటే అది రూక్ష భోజనం అవుతుంది . నూనె కడుపులోకి వెళితే పైత్యం చేస్తుంది . వేడిని పెంచుతుంది . గ్యాస్ ట్రబుల్ ని కలిగిస్తుంది . కానీ , నెయ్యి పైత్యాన్ని , వేడినీ తగ్గించి చలవ చేస్తుంది . గ్యాస్ ని పెరగనియ్యదు . కాబట్టి డైటింగ్ చేసేవారు నూనె పదార్దాలను పూర్తిగా మానేసి అన్నంలో మాత్రం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మంచిది .

6. జ్వరాలు (ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం) వంటి వ్యాధులతో ఎక్కువకాలం భాదపడేవారికీ , కీళ్ళనొప్పులు , నడుంనొప్పి వంటి వ్యాధులకు నొప్పులు తగ్గే బిళ్ళలు అధికంగా వాడే వారికీ గ్యాస్ ట్రబుల్ రాకపోతే ఆశ్చర్యపడాలి .

7. రాత్రిపూట జాగరణలు , నైట్ డ్యూటీలు , సెకండ్ షో సినిమాలు , స్టార్ టీవిలకు అతుక్కుపోవడం , పగలంతా పడుకోవడం చేసేవారికి గ్యాస్ ట్రబుల్ పిలిస్తే పలుకుతుంది .

8. ఈర్ష్య , భయం , ద్వేషం , ఆందోళన , దిగులు , విచారం , టెన్షన్ లు ” స్ట్రెస్ ” వంటివి కడుపుమంటకు ముఖ్య కారణాలు .

గ్యాస్ ట్రబుల్ రాకుండా చేసే ఉపాయాలు :

అగ్నిమాంద్యాన్ని ఆధునిక వైద్యులు ” డిస్ పెప్సియా ” అంటారు . ఇది రెండు రకాలుగా ప్రముఖంగా కనిపిస్తుంది . అప్పటికప్పుడు ముంచుకొచ్చినట్లు వచ్చేది. దీర్ఘకాలంగా బాధపెడుతుంది .

1. అజీర్తి పెరిగినప్పుడు చాలా తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం, ప్రేగుల మీద ఓవర్ లోడ్ పడకుండా జాగ్రత్తగా ఉండటం , అగ్నిమాంద్యం ఏర్పడటానికి కారణమైన పనుల్ని పైన చెప్పినట్లుగా గుర్తించి మానెయ్యడం అవసరం . ఇది ఆయుర్వేద మందులు వాడేవారికే కాదు, ఇంగ్లీష్ మందులు వాడే వారిక్కూడా ఉపయోగించే సలహానే .

2. కడుపులో మంట , గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు అవసరం అయితే విరేచనాలు అయ్యేందుకు ఏదైనా తీసుకొని బాగా ఝాడించినట్లు విరేచనాలు చేసుకొంటే గ్యాస్ ట్రబుల్ త్వరగా తగ్గుతుంది . నోట్లో నీళ్ళూరడం , గొంతులో మంట , తిప్పడం , వికారం ఉన్నవాళ్ళు ఉప్పునీరు త్రాగడం వంటి చిట్కాలు పాటించి వాంతులు ఒకటీ రెండు అయ్యేలా చేసుకొంటే ఇంకా మంచిది . తేలిక ఆహారాన్ని తీసుకోవడాన్ని ‘లంఖనం ‘ అంటారు . లంఖనం , వాంతి , విరేచనాలు మూడింటినీ చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ వ్యాధిని , ప్రేగుపూత వ్యాధినీ , కడుపులో మంటనీ అవలీలగా నివారించవచ్చు . ఈ మూడు నియమాలూ పాటించకుండా కేవలం మందులు ఎన్నివాడినా చాలామందిలో పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు . అయితే , రోగ తీవ్రతని బట్టి , రోగి బలాన్నిబట్టి విరేచనాలు , వాంతులు , లంఖనం వంటివి ఎంతమోతాదులో ఉండాలో నిర్ణయించుకోవాలి . అవసరం అయితే వైద్యుడి సలహా పొందడం మంచిది .

3. శొంఠిని నేతిలో వేయించి , మెత్తగా దంచి బెల్లం వేసి నూరి కుంకుడు గింజంత ఉండలు కట్టుకొని ఓ సీసాలో నిలువబెట్టుకోండి . అగ్నిమాంద్యం ఏర్పడిన దాన్నిబట్టి పూటకు ఒకటిగానీ రెండుగానీ రెండుపూటలా తీసుకోండి . భోజనానికి ముందు తింటే మరీ మంచిది . ఇది రోజూ తీసుకుంటే నిరంతరం కడుపులో జఠరాగ్ని జ్వలిస్తూనే ఉంటుంది . సమస్త వ్యాధులకీ జఠరాగ్ని మందగించటమే కారణం అనే సంగతిని మరొక్కసారి గుర్తుచేస్తున్నాను .

4. తరచూ అజీర్తి చేస్తున్న వాళ్ళు , గ్యాస్ పెరిగి పోతున్నవారు , కడుపులో మంటతో బాధపడుతున్నవారు చక్కగా ఇంట్లో చేసుకోదగిన మంచి ఫార్ములా.
ఇవి : ధనియాలు , జీలకర్ర , శొంఠి సమభాగాలుగా తీసుకొని నేతిలో విడివిడిగా వేయించి మరపట్టించి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో ఒకటిరెండు చెంచాలపొడిని కలుపుకొని తినండి . అలాగే మజ్జిగలో కలుపుకొని త్రాగవచ్చు . ఇందువలన జీర్ణశక్తి పెరుగుతుంది . ఈ పొడిని 2-3 చెంచాలు ఒక గిన్నెలో వేసి , ఎనిమిదిరెట్లు నీళ్లుపోసి నాలుగోవంతు నీరు మిగిలేలాగా బాగా మరిగించండి . చిక్కటి కషాయం వస్తుంది. గుడ్డలో వడకట్టి పంచదారగాని , ఉప్పుగాని కలుపుకొని త్రాగండి . తక్షణం ఆకలి పుట్టుకొస్తుంది . గొంతులోకి గ్యాస్ ఎగదట్టడం , మంట అన్ని తగ్గుతాయి .

5. చల్లటినీరు మాటిమాటికీ కాసిని కాసిని చొప్పున త్రాగుతుంటే కడుపులో మంట, గ్యాస్ తగ్గుతుంది . మజ్జిగ ఎక్కువగా త్రాగాలి . కానీ ఫ్రిజ్ లో పెట్టకుండా ఏ పూటది ఆపూట తోడుపెట్టి , చిలికి , పల్చగా చేసుకొని పులవకుండా త్రాగితే బాగా పనిచేస్తాయి. పెరుగు చిలికిన తర్వాత చల్లని నీళ్ళు కలుపుకోవచ్చు కానీ , మజ్జిగని ఫ్రిజ్ లో పెట్టకండి .

6. కడుపులో వాతం ఎక్కువగా చేరినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వాయువు వెళ్తూ ఉంటుంది . నీళ్ళలో చిటికెడంత ఉప్పు కలిపి గోరువెచ్చగా త్రాగితే వాతం తగ్గి కడుపులోంచి టపాకాయలు పేలడం ఆగుతాయి . పొట్టమీద వెచ్చగా కాపడం పెట్టడం వలన పొట్ట కండరాలు బిగదీయడం , లోపల పొట్లు , నొప్పి తగ్గి సుఖవిరేచనం అవుతుంది .

రాబోయే కొత్త వ్యాధులకు సూచిక గ్యాస్ ట్రబుల్ :

ఆపానవాయువులు పుట్టకుండా జాగ్రత్త పడాలి . జఠరాగ్నిని కాపాడుకొంటూ ఉంటే అవి ఉత్పన్నం కావు . కానీ , అగ్నిమాంద్యం ఏర్పడి గ్యాస్ పుట్టిన తర్వాత ఆపానవాయువులు బయటకు రాకుండా ఆపాలని ప్రయత్నిస్తే అనేక వాతవ్యాధులు పుట్టుకొస్తాయని ఆయుర్వేద శాస్త్రం హెచ్చరిస్తోంది . గ్యాస్ ట్రబుల్ వస్తోందంటే జీర్ణశక్తి నశిస్తోందని అర్ధం . దాన్ని తొలిదశలోనే జాగ్రత్తగా కనిపెట్టి అగ్నిని వృద్ధిచేసుకోవడం ప్రారంభించాలి . లేకపోతె ఇరవై ఏళ్ళకే 60 ఏళ్ళను చవి చూడవలసి వస్తుంది .

రాబోయే కొత్త వ్యాధులకు సూచిక గ్యాస్ ట్రబుల్ అని గుర్తించాలి . కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ , పేగుపూత , మలబద్ధకం , జిగురు విరేచనాలు , వాంతి , వికారం , పుల్లని త్రేన్పులు , గుండెలో మంట , నొప్పి ఇవన్నీ ఇంచుమించుగా సమీప వ్యాధి లక్షణాలే . వీటన్నిటికీ మూలకారణం … అగ్నిమాంద్యం … జీర్ణశక్తి తగ్గిపోవడం (లేదా) జఠరాగ్ని మందగించడం , వాము , సోంపు , ధనియాలు , జీలకర్ర , పిప్పళ్ళు , మిరియాలు , అల్లం , శొంఠి , దాల్చినచెక్క , ఆకుపత్రి , కరివేపాకు , కొత్తిమీర , వెల్లుల్లి , షోడాబైకార్బ్ (తినే షోడా ఉప్పు )… ఇవన్నీ అగ్నిని వర్ధిల్లచేసేవే . గట్టిగా చెప్పాలంటే , కడుపులో పొయ్యిని రాజేసేవే. వీటిని ఎప్పుడూ ఏదో ఒక రూపంలో తరచూ తీసుకొంటూ ఉండేవారికి గ్యాస్ ట్రబుల్ రాదు గాక రాదు .

Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.

Phone no : +91 9989759719

 

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Dr. Santhisree Bheesetti

Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

We often think of the nose as just for breathing and smelling. But in Ayurveda, the nose is a powerful gateway to the brain, especially when it comes to helping kids with conditions like autism, ADHD, and speech delays. Let’s dive into how simple nose drops can make a...

Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit

Our Treatments

Panchakarma

Shiro Abhyanga

Nasya Karma

Takradhara

Vasti Benefits

Open chat
1
Hi!
How Can I Help You?